న్యూఢిల్లీ, జూలై 11 : సులభ తరహ వాణిజ్య (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సూచీలో ఏపీ, తెలంగాణ తొలి రెండు ర్యాంకుల్లో నిలిచాయి. ఈ సూచీలో హర్యానా మూడవ స్ధానంలో నిలిచిందని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2017 వెల్లడించింది. గత ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్ర స్ధానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి రెండో స్థానంను పొందింది. సంస్కరణల ఆధారిత స్కోర్, ఫీడ్బ్యాక్ స్కోర్ను క్రోడీకరించిన అనంతరం తుది ర్యాంకులను ప్రకటించారు.
ఈ జాబితాలో జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలు సంస్కరణల ఆధారిత స్కోర్ను 100 శాతం సాధించడం గమనార్హం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జార్ఖండ్ నాలుగో ర్యాంక్లో, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ఐదో ర్యాంక్లో నిలిచాయి. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ పేలవమైన సామర్థ్యం కనబరిచి ఈ ఏడాది ర్యాంకింగ్స్లో 23వ స్ధానం సాధించింది.మరోవైపు వ్యాపారం నిర్వహించేందుకు అనుకూల దేశాల వార్షిక జాబితా 2017ను వరల్డ్ బ్యాంక్ ప్రకటించే ముందు రాష్ట్రాల తాజా ర్యాంకింగ్స్ వెలువడ్డాయి.