ఢిల్లీ, జూలై 12 : బీజేపీ - పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం తెగతెంపులు తర్వాత అక్కడి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్, ప్రధాని మోదీలు బుధవారం ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. నిర్మల్ సింగ్తో భేటీకి ముందు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, పార్టీ జాతీయ కార్యదర్శి రామ్మాధవ్తోనూ మోదీ సుదీర్ఘంగా భేటి అయ్యారు.
ఈ నేపథ్యంలో పీడీపీ రెబల్స్, ఇతర పార్టీల చీలిక వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తొలిసారి కశ్మీర్లో హిందువును సీఎంగా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితమే కశ్మీర్లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, శ్రీనగర్లోని బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్న విషయం సుస్పష్టమే. అయితే ఆగస్టులో అమర్నాథ్ యాత్ర పూర్తయిన తర్వాతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కూడా ఒక వర్గం భావిస్తోంది.