వడ్డీ వ్యాపారం @ వంద కోట్లు..

     Written by : smtv Desk | Thu, Jul 12, 2018, 12:07 PM

వడ్డీ వ్యాపారం @ వంద కోట్లు..

తిరుపతి, జూలై 12 : ఇరవై ఏళ్ల కిందట సైకిళ్లకు పంక్చర్లు వేసుకునే అతను.. చిన్న దుకాణం ప్రారంభించి రోజువారీ రూ.50 సంపాదించేవాడు. ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించాడు. తిరుపతికి చెందిన కందిశెట్టి రమేశ్ అందరికీ పల్లెవీధి రమేశ్‌గా సుపరిచితుడైన వడ్డీ వ్యాపారి. ఈయన దగ్గర రుణం తీసుకున్నవారిలో రోజువారీ కూలీ దగ్గర నుంచి అధికారులు, వైద్యులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. రోజువారి వడ్డీలకు అప్పులిచ్చి ఫైనాన్స్‌ వ్యాపారంలో పుంజుకుని చివరకు ఆదాయపుపన్ను శాఖ అధికారులకు చిక్కాడు. రమేశ్ వడ్డీ వ్యాపారం గురించి ఐటీ అధికారులకు సమాచారం అందడంతో వరుసగా రెండురోజుల పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు.

మంగళ, బుధవారాలు జరిపిన దాడుల్లో లభించిన ఆస్తుల చిట్టాను చూసి ఆదాయపుపన్ను శాఖ అధికారులే విస్తుపోయారు. బుధవారం వరకు లెక్కించిన ఆస్తుల మార్కెట్‌ విలువ ప్రకారం రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు. ఇంకా పన్ను మినహాయింపు ఆస్తులను, ఇతరత్రా వాటి విలువను కూడా లెక్కించే పనిలో ఉన్నారు. మంగళవారం ప్రారంభమైన ఐటీ దాడులు గురువారం సైతం కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఆదాయపు పన్నుశాఖ ఆపరేషన్‌ విభాగం అడిషినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మోహన్‌కుమార్‌ నేతృత్వంలో 25 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి దాడులను నిర్వహించారు.

తక్కువ కాలంలోనే ఎదిగిన రమేశ్‌కు రాజకీయ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. తిరుపతిలో ఇంత బహిరంగంగా వడ్డీల దందా నడుస్తున్నా... పోలీసులు ఇప్పటివరకు కళ్లు తెరవకపోవడం విశేషం. అంతేకాదు అనుకున్న సమయానికి రుణం చెల్లించకపోతే అప్పుతీసుకునే వాళ్లపై భౌతికదాడులకు పాల్పడటమే కాదు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.





Untitled Document
Advertisements