ఢిల్లీ, జూలై 12 : అంతర్జాల సేవలు అందరికీ సమానంగా (నెట్ న్యూట్రాలిటీ) అందేలా ఇంటర్నెట్ తటస్థ నిబంధనలకు టెలికాం కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం సేవల విషయంలో నెట్వర్క్ సంస్థలు పక్షపాతం చూపడం, కొన్నింటిని నిరోధించడం, మరి కొన్నింటికి అధిక వేగంతో సేవలందించడం వంటి వాటికి ఫుల్ స్టాప్ పడనుంది. అయితే అంతర్జాలం సాయంతో మారుమూల ప్రాంతాల్లో జరిగే శస్త్రచికిత్సలు, స్వీయ చోదక కార్లకు ఇందుకు మినహాయింపు ఉంది. నూతన టెలికాం విధానమైన నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ 2018కి కూడా కమిషన్ ఆమోదం ముద్ర వేసింది.