ముంబై, జూలై 12 : నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలు బాగానే పెరిగాయి. ఇండియాలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. రిజర్వు బ్యాంకు నెలవారీ బులిటెన్లోని గణాంకాల ప్రకారం మేలో భారత్లో కార్డుల ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ. లక్ష కోట్లకు దగ్గరలో ఉంది. 2018 మే నెలలో రూ. 93,860 కోట్ల విలువ చేసే 46 కోట్ల 60 లక్షల లావాదేవీలు కేవలం కార్డుల ద్వారానే జరిగాయి. ఈ లావాదేవీల విలువ రూ.లక్షకోట్లు దాటితే కార్డులతో జరిపే డిజిటల్ లావాదేవీల్లో భారత్ ఓ మైలురాయిని చేరుకున్నట్లే.
ఈ కామర్స్ వ్యాపారంలోనూ కార్డులు వినియోగిస్తున్నప్పటికీ ఆ సమాచారాన్ని ఆర్బీఐ తెలపలేదు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే పద్ధతి చాలా సంవత్సరాలుగా భారత్లో అందుబాటులో ఉంది. మొబైల్ వాలెట్లు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధార్ ద్వారా జరిపే చెల్లింపులు(ఏఈపీఎస్) వంటివి గత కొన్నేళ్లుగా భారత్లోని ప్రాచుర్యంలోకి వచ్చాయి. మిగతా పేమెంట్ల కంటే బ్యాంకులు కార్డు పేమెంట్లపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి.