కోయింబత్తూరు, జూలై 13 : కాలేజీ లో నిర్వహించిన మాక్ డ్రిల్ కారణంగా ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కోయింబత్తూరులో జరగింది. వివరాల్లోకి వెళితే.. గురువారం కోయింబత్తూరులోని కోవై కళైమగల్ ఆర్ట్స్ కళాశాలలో ఎన్డీఎంఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ)బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. ట్రైనర్ టీఆర్ ఆర్ముగం పర్యవేక్షణలో ఈ మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను రెండో అంతస్తు నుంచి కిందకు దూకాలని చెప్పారు. అదే కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లోకేశ్వరి అనే విద్యార్థిని రెండో అంతస్తు నుంచి దూకడానికి భయపడుతుండడంతో ఆర్ముగం ఆమెను కిందికి తోసేశాడు. దాంతో ఆ యువతి తల మొదటి అంతస్తు గోడ అంచుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది.
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు కొందరు వీడియో తీయడంతో విషయం బయటకు వచ్చింది. ఆ యువతి దూకడానికి భయపడుతున్నప్పటికీ ట్రైనర్ ఆమెను బలవంతంగా తోసేశాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్రైనర్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.