ఢిల్లీ, జూలై 14 : వచ్చే సంవత్సరం రిపబ్లిక్ డేకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారత్ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఏప్రిల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆహ్వానం పంపగా శ్వేతసౌధం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు అధికార వర్గాలు నిరాకరించాయి. గతేడాది గణతంత్ర దినోత్సవాలకు ఆసియా దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కోసమే వారిని భారత్ ఆహ్వానించింది. భారత్ ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ట్రంప్ హాజరైతే ఈ వేడుకకు హాజరైన రెండో అమెరికా అధ్యక్షుడవుతారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.