ఢిల్లీ, జూలై 14 : రాజ్యసభకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. నామినేట్ అయిన వారిలో దళిత నాయకుడు రామ్ శకల్, ప్రముఖ కాలమిస్ట్ రాకేశ్ సిన్హా, శిల్పకారుడు రఘనాథ్ మహాపాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మన్సింగ్ ఉన్నారు. ప్రధాన మంత్రి సూచన మేరకు సాహిత్యం, కళ, సైన్స్, సామాజిక సేవా రంగాలకు చెందిన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, బాలీవుడ్ నటి రేఖ, పారిశ్రామిక వేత్త అను అఘా, న్యాయవాది కె.పరాశరణ్ ఇటీవలే పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో కొత్త సభ్యులను రాష్ట్రపతి శనివారం నామినేట్ చేశారు.