హైదరాబాద్, జూలై 14 : యువ కథానాయకుడు కార్తి కథానాయకుడిగా.. పాండిరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కడియకుట్టి సింగం'. 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మాతగా తెరకెక్కించారు. సయేష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి 'చినబాబు' పేరుతో విడుదల చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలిసారి కార్తి పూర్తిస్థాయి రైతు పాత్రలో ప్రేక్షకులను అలరించారు.
అయితే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం సాధించింది. రైతు కష్టాలను సున్నితంగా చర్చిస్తూనే ఒక ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, అలకలు, కోపాల్ని తెరపై ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సూర్య అందరికీ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. "దర్శకుడు పాండిరాజ్కు, మొత్తం చిత్ర బృందానికి నా ధన్యవాదాలు. భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులు కనెక్ట్ అవడం చూశాక చాలా సంతోషంగా ఉంది. మనసారా నవ్వాను, ఆనంద బాష్పాలు ఆగలేదు. నీ పట్ల సంతోషంగా ఉంది కార్తీ. మాపై ప్రేమను కురిపించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అంటూ సూర్య పేర్కొన్నారు.