హైదరాబాద్, జూలై 14 : హాలీవుడ్ చిత్రాలు అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి ఉంటుంది. ఆ చిత్రాలు గత కొంతకాలంగా భారతీయ బాక్సాఫీస్ వద్ద తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 'బ్లాక్ పాంథర్', 'అవెంజర్స్: ఇన్ఫినిటీవార్','డెడ్పూల్2','జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్' లు తమ సత్తా చాటాయి. ఇప్పుడు తాజాగా చీమ మనిషి వంతు వచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్’ చిత్రానికి చక్కని ఓపెనింగ్స్ లభించాయని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.
ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు తొలిరోజు విశేష స్పందన లభించిందని, శుక్రవారం నెట్ కలెక్షన్లు రూ.5.50కోట్లు కాగా, అన్ని భాషల్లో కలిపి మొత్తం రూ.7.05కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది విడుదలైన మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఇన్ఫినిటీవార్’ తొలిరోజు అత్యధికంగా రూ.31కోట్లు వసూలు చేసింది. ఇక మొత్తంగా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.250కోట్లు వసూలు చేయడం విశేషం. మరో సూపర్ హీరో చిత్రం ‘డెడ్పూల్2’కు రూ.11కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లు రాగా, 'జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్' కు అత్యధికంగా రూ.53కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లు తెచ్చింది.