ఢిల్లీ, జూలై 14 : ఇండియా దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం ‘టేకాఫ్’ దశలో ఉందని, 2030 నాటికి దేశ జీడీపీ 10 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ అన్నారు. మరో దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్ ఎదుగుతుందని గార్గ్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి 40ఏళ్లలో భారత జీడీపీ అతి కష్టంగా 3.5శాతానికి పెరిగిందని.. ఇప్పుడు 7శాతం దాకా వచ్చిందన్నారు. 2030 నాటికి దేశ జీడీపీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. అది మనకు ఒక సవాలుతో పాటు మంచి అవకాశాలను కూడా కల్పిస్తుందన్నారు.
ఇటీవల ప్రపంచబ్యాంక్ ప్రకటించిన నివేదిక ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఉంది. ఫ్రాన్స్ను వెనక్కినెట్టేసి భారత్ ఈ ఘనత సాధించింది. 'మంచిరోజులు ముందున్నాయి. ఆర్థికవ్యవస్థ పురోగతి కోసం ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం టేకాఫ్ దశలో ఉంది. ఇక భారతీయులు తలెత్తుకుని నిలబడతారు. 8శాతం వృద్ధిని తప్పకుండా సాధిస్తాం. దాన్ని అలాగే కొనసాగిస్తే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశంగా నిలుస్తుంది' అని గార్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.