మాస్కో, జూలై 14 : ఫిఫా ప్రపంచ కప్ -2018 అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఎంతో ఉత్కంఠగా సాగింది. చివరకు ఫైనల్లో ఫ్రాన్స్, క్రోయేషియా జట్లు రేపు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్లో తొలిసారి వీఏఆర్(వీడియో సహాయక రిఫరీ)ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. వార్ సాయంతో మెరుగైన ఫలితాలను రాబట్టినందుకు టోర్నీ నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. టోర్నీలో భాగంగా ఈ రోజు 3, 4 స్థానాల కోసం ఇంగ్లాండ్-బెల్జియం మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు మాట్లాడుతూ...'ఈ ఏడాది తొలిసారి ప్రపంచకప్లో ‘వార్’ టెక్నాలజీని ఉపయోగించాం. దీని ద్వారా మెరుగైన, కచ్చితమైన ఫలితాలను రాబట్టాం. ఇప్పటి వరకు మొత్తం 62 మ్యాచ్ల్లో 440 సార్లు ‘వార్’ సాయం తీసుకున్నాం. ఈ సాంకేతికతో ఫుట్బాల్ క్రీడలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవు. మరింత పారదర్శకంగా ఫలితాలు రాబట్టేందుకే దీన్ని వాడుతున్నాం. అని వారు వ్యాఖ్యానించారు.