హైదరాబాద్, జూలై 15 : 'ఆ నలుగురు', సినిమా తీసిన చంద్ర సిద్దార్థ.. ప్రస్తుతం 'ఆటగదరా శివ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాక్లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. ఉదయ్ శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి వాసుకి వైభవ్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమాలోని ఓ పాటను పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు పవన్ కళ్యాణ్.. 'ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే.. పుట్టుక, చావు యాతన నువ్వు రాసే నుదుటి రాతలే.. నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు...' అంటూ సాగే గీతాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. కాగా ఈ చిత్రాన్ని జూలై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకుని ఓ ఖైదీ.. అనుకోకుండా తనను ఉరితీయాల్సిన తలారినే కలుస్తాడు. వాళ్లెవరన్న విషయం పరస్పరం తెలియకపోవడంతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి? వాళ్లు ఎవరెవరిని కలిశారు? అనేది మా సినిమాలో ఆసక్తికరమైన అంశంగా తెలుస్తోంది.