హైదరాబాద్, జూలై 15 : కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్న కథానాయిక నయనతార. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో హవా చాటుకుంటున్నారు. ప్రస్తుతం నయన్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'కొలమావు కోకిల' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మత్తుమందులు తరలించే మహిళగా నయనతార నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది.
కానీ ఇక్కడ సమస్యేంటంటే.. అదే రోజు విలక్షణ నటుడు కమల్ హసన్ "విశ్వరూపం 2"ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ముగించి కమల్ ఈ మధ్యే సెన్సార్ సర్టిఫికెట్ పొందారు. ఈ చిత్రం కూడా ఆగస్టు 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల అనంతరం కమల్ సినిమా థియేటర్ కు రానుంది. దీంతో అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఒకేరోజు కమలహాసన్, నయనతార నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీ కావటంతో కోలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.