ఢిల్లీ, జూలై 15 : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కు నీరవ్ మోదీ చేసిన మోసం ఎప్పటికి చెరగని మచ్చ. దాదాపు రూ. 14000 కోట్లు ఎగనామం పెట్టి నీరవ్ విదేశాలకు చెక్కేసిన విషయం తెలిసిందే. ఏ బ్యాంకుకైనా మొండి బకాయిల సొమ్ము తిరిగి వసూలు చేసుకోవడం ఒక ఎత్తయితే, ఖాతాదారుల విశ్వాసం పోకుండా చూసుకోవడం మరో ఎత్తు. పీఎన్బీకి నీరవ్ మోదీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న బ్యాంకు అధికారులు రుణాలు వసూలు చేసే విషయంలో కఠినంగా వవ్యహరిస్తున్నారు. ఎంతలా అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా రూ.7,700కోట్ల మొండి బకాయిలను వసూలు చేశారు.
2017-18 ఆర్థిక సంవత్సరంతో మొత్తంలో వసూలు చేసిన రుణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్- ఐబీసీ (దివాలాస్మృతి) అమల్లోకి రావడం బ్యాంకులకు వజ్రాయుధంగా మారింది. "గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వసూలు చేసిన మొత్తం మొండి బకాయిలు రూ.5,400కోట్లు మాత్రమే. అయితే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే ఏకంగా రూ.7,700కోట్లు వసూలు చేశాం. ఈ విషయంలో ఐబీసీ కీలక పాత్ర పోషించింది. రెండు పెద్ద ఖాతాల నుంచి బకాయిలను వసూలు చేయగలిగాం" అని పీఎన్బీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా వ్యాఖ్యానించారు.