హైదరాబాద్, జూలై 16 : సూపర్స్టార్ మహేష్బాబు.. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'భరత్ అనే నేను'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. మహేష్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రంపై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ చిత్రం కోసం పని చేసిన వారిలో కొందరికి నిర్మాత.. రెమ్యునరేషన్ చెల్లించలేదని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై తాజాగా దానయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు.. 'మా నిర్మాణ సంస్థ మీద వచ్చిన నిరాధారమైన ఆరోపణలు మమ్మల్ని ఎంతో బాధించాయి. 'భరత్ అనే నేను' లాంటి బ్లాక్బస్టర్ చిత్రానికి పనిచేసినందుకు మేము, మా టీమ్ అంతా ఎంతో గర్వపడుతుంటాం. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ పారితోషికాలు అందించాం. ఇంకా ఎవరికైనా అనుమాలు ఉంటే హైదరాబాద్ లోని మా కార్యాలయానికి వచ్చి కనుక్కోవచ్చు. లేదంటే నటీనటులను గాని సంప్రదించవచ్చు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలు రాసి ప్రచురించవద్దని విజ్ఞప్తి నిర్మాత దానయ్య పేర్కొన్నారు.