చెన్నై, జూలై 16 : తెలుగుదేశం పార్టీకి డీఎంకే నైతిక మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ కనిమొళి అన్నారు. విభజన హామీల కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎంపీలు ఈరోజు చెన్నైలో కనిమొళితో సమావేశమయ్యారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు.. వాటిని నెరవేర్చడంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలనే నెరవేర్చాలని తెదేపా ఎంపీలు కోరుతున్నారని.. వారికి తాము అండగా ఉంటామన్నారు. ఇటీవల కడపలో ఉక్కు కర్మాగారం కోసం తెదేపా ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన ఆమరణ దీక్షకు కనిమొళి సంఘీభావం ప్రకటించారు.