హైదరాబాద్, జూలై 16 : 'అఖిల్' భామ సాయేషా సైగల్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ యానిమేషన్ పాత్రకు జోడీగా నటించనున్నారు. మోషన్ క్యాప్చర్ యానిమేషన్ టెక్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో 'కిళక్కు ఆఫ్రికా విల్ రాజు' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఎంజీఆర్ యానిమేషన్ పాత్రకు జోడీగా సాయేషా సైగల్ నటించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ఇషారి కె.గణేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆయన జీవితాధారంగా తెరకెక్కిస్తున్నది కాదు.
ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో నిర్మాత గణేష్ మాట్లాడుతూ.. 'ఎంజీఆర్ అభిమానులు ఎంజాయ్ చేయగలిగేలా ఇందులో బైక్ రేస్లు, ఫైటింగ్ సన్నివేశాలను రూపొందిస్తున్నాం' అని వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని ఎంజీఆర్ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల విడుదలైన 'చినబాబు' చిత్రంలో సాయేషా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ప్రముఖ కథానాయకుడు కార్తీ, పాండిరాజ్ కాంబోలో రూపొందిన చిత్రం 'చినబాబు'. హీరో సూర్య, 2డి ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.