హైదరాబాద్, జూలై 17 : బాలీవుడ్ కింగ్ఖాన్ షారుక్ హీరోగా, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జీరో'. ఇందులో షారుక్ మరుగుజ్జు పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని షారూక్ భార్య గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కత్రినా కైఫ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కత్రినా ప్రత్యేకమైన లుక్ లో దర్శనమిస్తోంది. తన ముందు ఫోటోగ్రాఫర్స్ ఉండగా.. చుట్టూ భద్రత నడుమ నడుచుకుంటూ వస్తోన్న కత్రినా లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అజయ్-అతుల్ సంగీతం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.