హైదరాబాద్, జూలై 17 : స్వామి పరిపూర్ణానంద నుండి హైదరాబాద్ నుండి బహిష్కరించడం అన్యాయమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ఈ విషయమై నిన్న సీఎంకు లేఖ రాశానని, బీజేపీ నేతలంతా కలిసి కలవడానికి వస్తామని చెప్పామని అన్నారు. అందుకు ఆయన అంగీకారం తెలపలేదని, అందుకే బీజేపీ నేతలందరం నిరసన తెలిపామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పరిపూర్ణానంద స్వామి శ్రీరాముడిని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, శాంతియుతమైన పాదయాత్ర చేపట్టినందుకు నగర బహిష్కరణ చేయడం చట్ట వ్యతిరేకమని కిషన్ రెడ్డి అన్నారు. బహిష్కరణ అనేది నిజాం కాలంలో పెట్టిన పోలీస్ చట్టమని, కేసీఆర్ నిజాం పారిపాలనలా అమలు చేశారని, దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. పరిపూర్ణానందను బహిష్కరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని, ఆయన ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని కిషర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పును సరిద్దుకుని, స్వామికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, బహిష్కరణ వేటును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీరాముడిపై కత్తి మహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు చేసినందుకు గానూ యాదాద్రి వరకు పాదయాత్ర చేస్తానని పరిపూర్ణానంద స్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారిద్దరిని ఆరు నెలలపాటు నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు రెండు రోజుల క్రితం నగరాన్ని వదిలివెళ్లారు.