మరో సారి అవిశ్వాస అస్త్రం వేయనున్న టీడీపీ..

     Written by : smtv Desk | Tue, Jul 17, 2018, 03:46 PM

మరో సారి అవిశ్వాస అస్త్రం వేయనున్న టీడీపీ..

ఢిల్లీ, జూలై 17: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ మళ్లీ కేంద్రంపై అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది. విభజన హామీల సాధన కోసం కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసిన ఆ పార్టీ మంగళవారం తాజాగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేశారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ కేశినేని నాని మంగళవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. రేపు జరిగే సభా కార్యకలాపాల జాబితాలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు.

రాష్ట్ర విభజన హామీల సాధనే లక్ష్యంగా గతంలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తెదేపా, వైకాపా సభ్యులు పోటాపోటీగా పలుమార్లు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు కోసం చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సభ ఆర్డర్‌లో లేదంటూ సభాపతి సుమిత్రా మహాజన్‌ చెప్పడం, సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేయడంతో వాయిదాల పరంపరతో సభా కార్యకలాపాలు స్తంభించిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంతో ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనున్నాయి. 18 రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఓబీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యంగ హోదా బిల్లు, ట్రిపుల్‌ తలాక్ బిల్లు సహా ముఖ్యమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.





Untitled Document
Advertisements