హైదరాబాద్, జూలై 17 : తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా 'ఎన్టీఆర్' చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆయన వారసుడు బాలకృష్ణ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించడం గురించి విద్యా.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ.. "బసవతారకం ఎన్టీఆర్ భార్యగానే అందరికీ తెలుసు. ఆమె జీవితాన్ని ఎప్పుడూ పబ్లిక్ ప్లాట్ఫాంపైకి డాక్యుమెంటరీగా కూడా తీసుకురాలేదు. ఈ పాత్రలో నటించేందుకు ఓ నటిగా ఇదే నాకు ఆసక్తిని పెంచింది. ఇందులో బసవతారకానిది టైటిల్ పాత్ర కాదు. కానీ ఆమె కథలో చాలా కీలకం. అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నా. షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా" అని పేర్కొన్నారు. కాగా ఎన్టీఆర్ లో.. నాగచైతన్య, మోహన్ బాబు, కీర్తి సురేష్, రాజశేఖర్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీయులంతా నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి నటీనటుల విషయంలో క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.