హైదరాబాద్, జూలై 17 : అక్కినేని నాగార్జున చాలాకాలం తర్వాత బాలీవుడ్ లో 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ చిత్రంలో నాగ్ ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రంలో రణ్బీర్కపూర్, అలియా భట్లు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ కు జోడీగా డింపుల్ కపాడియా కనిపించనున్నట్టు సమాచారం. మూడేళ్ల గ్యాప్ తరువాత డింపుల్ చేసే సినిమా ఇదే కావడం విశేషం.
విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. ఇటీవల చిత్రబృందంతో కలిసి దిగిన ఫోటోలను నాగ్ సోషల్మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. 'చిత్రయూనిట్ను మిస్ అవుతున్నా' అంటూ ట్వీట్ చేయగా.. ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ నాగార్జునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.