హైదరాబాద్, జూలై 17 : సూపర్స్టార్ మహేష్బాబు.. కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. మహేష్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రంపై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ చిత్రం కోసం పని చేసిన వారిలో కొందరికి నిర్మాత.. రెమ్యునరేషన్ చెల్లించలేదని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై స్పందించిన నిర్మాత దానయ్య.. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ పారితోషికాలు అందించామని.. ఇలాంటి నిరాధారమైన వార్తలు రాసి ప్రచురించవద్దని విజ్ఞప్తి చేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన దర్శకుడు కొరటాల శివ.. రెమ్యునరేషన్ చెల్లించలేదని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. డీవీవీ దానయ్య గొప్ప వ్యక్తి అని.. సినిమా విడుదలకు ముందే తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం చెల్లించారని తెలిపారు. ప్రస్తుతం మూడు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న దానయ్య.. తమకు పారితోషికం చెల్లించకుంటే, ఆ సినిమాలను ఆయన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలను ఖండిస్తున్నానని వెల్లడించారు.