లీడ్స్, జూలై 18 : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లిసేన మూడు వన్డేల సిరీస్ ను కోల్పోయింది. సిరీస్ లో భాగంగా జరిగిన చివరి నిర్ణయాత్మక పోరులో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి.. సిరీస్ ను 2-1తో తమ వశం చేసుకుంది. దీంతో టి-20 సిరీస్ విజయం తెచ్చిన ఊపులో వన్డే సిరీస్ కూడా గెలుచుకోవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... శిఖర్ ధావన్ (49 బంతుల్లో 44; 7 ఫోర్లు), ధోని (66 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు.
అనంతరం ఇంగ్లండ్ 44.3 ఓవర్లలో 2 వికెట్లకు 260 పరుగులు చేసి విజయాన్నందుకుంది. జో రూట్ (120 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీ సాధించగా, ఇయాన్ మోర్గాన్ (108 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగాడు. వీరిద్దరు మూడో వికెట్కు 35.2 ఓవర్లలో అభేద్యంగా 186 పరుగులు జోడించారు. ఆదిల్ రషీద్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... రూట్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.