ఎఫ్ఆర్‌డీఐ బిల్లు ఈ సారికి లేనట్లే..!

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 01:51 PM

ఎఫ్ఆర్‌డీఐ బిల్లు ఈ సారికి లేనట్లే..!

ఢిల్లీ, జూలై 19 : ఫైనాన్సియ‌ల్ రిజ‌ల్యూష‌న్ అండ్ డిపాజిట్ (ఎఫ్ఆర్‌డీఐ) బిల్లును కేంద్రప్రభుత్వం పూర్తిగా అట‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో ప్ర‌జ‌ల డిపాజిట్ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం తీసుకురాద‌లుచుకున్న(ఎఫ్ఆర్‌డీఐ) బిల్లును గ‌త స‌మావేశాల స‌మ‌యంలో పార్ల‌మెంట్ ప‌క్క‌న పెట్టేసింది. దాన్ని అప్ప‌ట్లో స్టాండింగ్ క‌మిటీకి పంపించారు. అయిన‌ప్ప‌టికీ డిపాజిట‌ర్ల‌లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌లు మాత్రం తొల‌గ‌లేదు. ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల్లోగా ఈ బిల్లును వెన‌క్కి తీసుకుంటుంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో దీనిపై ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే దాని బ‌కాయిలు తీర్చేందుకు, ఆ బ్యాంకుల్లో పొదుపు చేసిన డిపాజిట్‌దారుల డిపాజిట్ల‌ను సైతం వాడుకునే వెసులుబాటు ఉండేలా ఎఫ్ఆర్‌డీఐ బిల్లులో ప్ర‌త్యేక నిబంధ‌న(బెయిల్-ఇన్) ఉంద‌ని అప్ప‌ట్లో ఆర్థిక వ‌ర్గాలు గోల పెట్టాయి. ప్రతిపాదిత బిల్లులోని 'బెయిల్-ఇన్' క్లాజ్ ప్రధానంగా భయాందోళనలకు కారణమవుతోంది. ఇప్పటివరకూ దివాలా తీసిన బ్యాంకులను ఆదుకునేందుకు 'బెయిల్ అవుట్' కింద ప్రభుత్వం ఎంతో కొంత సాయం అందిస్తోంది. ప్ర‌భుత్వం మీద భారం లేకుండా బ్యాంకు వ‌ద్ద ఉన్న సొమ్మునే దివాలా ప్ర‌క్రియ‌కు వాడుకునేందుకు ఎఫ్ఆర్‌డీఐ బిల్లు వీలు క‌ల్పిస్తుంద‌నేది డిపాజిట్‌దారుల వాద‌న‌. దీనిపై డిపాజిట‌ర్ల‌తో పాటు, అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైంది. దీంతో ప్ర‌భుత్వం జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీకి నివేదించింది. పార్ల‌మెంటు ప్ర‌స్తుత స‌మావేశాలు ముగిసేలోపు ఈ కమిటీ త‌న నివేదిక స‌మ‌ర్పించ‌నుంది.





Untitled Document
Advertisements