ఉత్తరాఖండ్, జూలై 19 : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుర్యధార్ ప్రాంతంలో రిషికేశ్ - గంగోత్రి రహదారిపై రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు అదుపుతప్పి 250 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో 9 మంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయసిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయమ్స్ కు తరలించేందుకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50ల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.