ముంబై, జూలై 20 : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా 'సంజు' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ కథానాయకుడి పాత్ర పోషించారు. విక్కీ కౌశల్, మనీషా కొయిరాలా, పరేశ్ రావల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, దియా మీర్జా, టబు, షియాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్. రెహమాన్ స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్లో చేరిపోయింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సంజయ్ దత్ నిజమైన బయోపిక్ను తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఈ విషయాన్ని తెలిపారు. 'సంజు' సినిమాలో అన్నీ కల్పితాలే చూపించారని సంజయ్ అసలు జీవితం గురించి తాను తీయబోయే బయోపిక్లో చూపించాలనుకుంటున్నారట. ఈ మేరకు సంజయ్ సన్నిహితులతో పాటు అక్రమ ఆయుధాల కేసును విచారించిన పోలీసులతోనూ వర్మ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై వర్మ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.