హైదరాబాద్, ఆగస్టు 01: అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల షూటింగ్ పూర్తయింది.
కాగా ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు సమస్యలు ఎదురయ్యాయట. ఈ సినిమా సెట్ను రెవెన్యూ అధికారులు తొలగించినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని ప్రభుత్వ భూమిలో భారీ సెట్ నిర్మించారట. అక్కడే ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
‘రంగస్థలం’ సెట్ నిర్మాణం, చిత్రీకరణ నిమిత్తం గతంలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. కానీ ‘సైరా’ కోసం తాజాగా మరోసారి అనుమతి తీసుకోనట్లు సమాచారం. ఈ కారణంగా రెవెన్యూ అధికారులు సెట్ను తొలగించినట్లు తెలిసింది. దీంతో షూటింగ్కు అంతరాయం ఏర్పడిందట. అయితే చిత్ర బృందం ఇంకా దీనిపై స్పందించలేదు.
సోమవారం (జులై 30) ‘సైరా’ సినిమా సెట్లో తీసిన ఫొటోలు లీక్ అయ్యాయి. సోషల్మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నారు.