అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు శుభసూచకంగా జరుపుకునే పండుగను 'రాఖీ' లేదా 'రక్షాబంధన్' అంటారు. దీనికి 'రాఖీ పౌర్ణమి' అనే మరో పేరు కూడా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మాత్రమే ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా విస్తరించింది.
రక్షా అంటే రక్షణ, బంధన్ అంటే బంధం అని అర్ధం. సకల వేళల తమకు రక్షణగా నిలువాలని కోరుకుంటూ స్త్రీలు తమ సోదరుల ముంజేతికీ రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు. అదే విధంగా సోదరుడు రాఖీ కట్టిన చెల్లిని ఏ సమస్యలు రాకుండా... జీవితాంతం రక్షగా ఉంటానని భావించే పండుగగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు.హారతి ఇచ్చి, నుదట మంగళ తిలకం దిద్దుతుంది. దీనికి బదులుగా సోదరుడు తన సోదరికి ఏ కష్టంమొచ్చిన కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఆమెకు తనకు తోచిన కానుకలను అందజేస్తాడు.
శ్రావణ పౌర్ణమికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్గా పిలిచే ఈ పండుగను సావనీ, సలోనా అనీ కూడా అంటారు. దక్షిణాదిలో నారీకేళ పౌర్ణమి, అవనీ అవిత్తమ అనే పేర్లతోనూ, మధ్య భారతంలో కజరీ పౌర్ణమి, గుజరాత్లో పవిత్రోపనా అనే పేర్లతోనూ పిలుస్తారు.
రాఖీ పౌర్ణమి పూర్వపు చరిత్ర
అన్న చెల్లెలైనా ద్రౌపది-శ్రీకృష్ణుడికి అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తోంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామి ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి అమెను కాపాడుతాడు. దీంతో అన్నా చెల్లెళ్ల బంధం గొప్పదిగా భావిస్తూ రాఖీ పౌర్ణమి ని జరుపుకుంటారు