రాంలీలా మైదాన్కు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మైదాన్గా పేరు మార్చడం లేదని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) తెలిపింది. రాంలీలా మైదాన్ పేరును వాజ్పేయి మైదాన్గా మార్చడం ఓట్లు రాల్చదని, మోదీ పేరుతో ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా లేరని..ఆయన పేరును మార్చాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన క్రమంలో ఎన్డీఎంసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. వాజ్పేయి పేరును వాడుకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వస్తాయని వారు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి ప్రధాని పేరు మార్చితే ఓట్లు పడొచ్చని తనదైనశైలిలో వ్యంగ్యబాణం వేశారు.
వాజ్పేయి పేరును రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారని మాజీ ప్రధాని మేనకోడలు విమర్శించిన నేపథ్యంలో కేజ్రీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే రాంలీలా మైదాన్ పేరు మార్చే ప్రతిపాదన ఏదీలేదని, అనవసరంగా రాద్ధాంతం జరుగుతున్నదని బీజేపీ నేతలు అంటున్నారు.
మరోవైపు రాంలీలా మైదాన్ పేరు మార్చే ప్రతిపాదన లేదని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ పేర్కొన్నారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో ఈ వదంతులు సృష్టిస్తున్నారని, తాము రామ భక్తులమని రాంలీలా మైదాన్ పేరు మార్చే ప్రసక్తే లేదన్నారు.
ఎన్డీఎంసీ కౌన్సిలర్లు కొందరు మైదానానికి వాజ్పేయి పేరు పెట్టాలని కోరినట్టు వచ్చిన వార్తలు నిరాధారమన్నారు. ఢిల్లీ రైల్వేస్టేషన్కు సమీపంలోని చారిత్రక రాంలీలా మైదాన్ రాజకీయ పార్టీల సభలకు, కార్యక్రమాలకు వేదికవుతోంది. రాజకీయ పార్టీల కార్యకలాపాలతో పాటు ప్రతిఏటా ఇక్కడ రామ్లీలా నిర్వహిస్తారు.