బ్యూటీషియన్ పద్మ కేసులో కీలక మలుపు

     Written by : smtv Desk | Mon, Aug 27, 2018, 11:17 AM

బ్యూటీషియన్ పద్మ కేసులో   కీలక మలుపు

బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు బత్తుల నూతన్‌ కుమార్‌ (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం గుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలోని నుదురుపాడు రైల్వేస్టేషన్‌ వద్ద నూతన కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పద్మపై జరిగిన దాడి కేసులో పోలీసులే విస్తుపోయే పెను ట్విస్ట్ ఇది. ఆమెను హత్య చేయాలని చూసి, దారుణంగా ప్రవర్తించాడని భావిస్తున్న నూతన్ కుమార్ నిన్న రైలు పట్టాల వద్ద విగతజీవిగా కనిపించడంతో, పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత భావించినప్పటికీ, అతన్ని ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసి ఉంటారన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

పద్మ తన వాగ్మూలంలో సుబ్బయ్య అనే వ్యక్తి పేరు చెప్పగా, అతను ఎవరన్న విషయంపైనా విచారిస్తున్నారు. ఈ కేసులో సుబ్బయ్య రెండో నిందితుడని చెప్పిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.నూతన్ ను సుబ్బయ్య హత్య చేసి ఉండవచ్చన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. పద్మ చేతిపై ఉన్న 'ఎన్' అన్న పచ్చబొట్టును కత్తితో చెరిపివేయడం, ఆపై నుదుటిపై 'ఎస్' అన్న అక్షరాన్ని రాయడం వెనుక ఉన్న మిస్టరీ, సుబ్బయ్యను అరెస్ట్ చేస్తే వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు. పద్మ భర్త పేరు కూడా సూర్యనారాయణ ఎస్‌ అక్షరంతో ఉండడంతో పోలీసులు మరో కోణంలో విచారిస్తున్నారు.





Untitled Document
Advertisements