ఐఆర్సిటిసి భూ కుంభకోణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నేత లాలూ యాదవ్ భార్య రబ్రీదేవీ, వారి కుమారుడు తేజస్వియాదవ్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. తలో లక్ష రూపాయల షూరిటీ కింద బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. రాంచీలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో లూలూ కోర్టుకు హాజరుకాలేదు.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసుకు సంబంధించి ఉదయం 10 గంటలకు పటియాల కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో సీబీఐ నిందితులుగా పేర్కొన్న రబ్రీదేవి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్ పటియాలా హౌస్ కోర్టు ముందు హాజరయ్యారు.
తేజస్వి, రబ్రీలతో సహా నిందితులు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ విచారణను వాయిదా వేసింది.