* ఇద్దరిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం
* మరో ముగ్గురికి ఊరట
హైదరాబాద్: పదకొండేళ్ల క్రితం హైదరాబాద్లో జరిగిన జంట పేలుళ్ల విధ్వంసం కేసులో ఎన్ఐఏ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇద్దరిని దోషులుగా నిర్థారించిన న్యాయమూర్తి.. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. అనీక్ షఫీక్, అక్బర్ ఇస్మాయిల్ను దోషులుగా నిర్థారిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరిద్దరికి శిక్షలపై సోమవారం తీర్పు ప్రకటించనున్నారు. సరైన ఆధారాలు లేనందున ఫరూఖ్ షఫ్రుద్దీన్, సాధిక్ ఇసార్, అంజుమ్లను నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.
2007 ఆగస్టు 25న లుంబినీ పార్కు, కోఠిలోని గోకుల్ఛాట్లో విద్రోహ శక్తులు బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో 44 మంది మృతిచెందగా 50మందికిపైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్ బృందం తేల్చింది. రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, మహ్మద్ తారీఖ్, షప్రుద్దీన్, మహ్మద్ షేక్, అమీర్ రజాఖాన్లను నిందితులుగా అభియోగపత్రాల్లో పేర్కొంది. వీరిలో అరెస్టు అయిన ఐదుగురు చర్లపల్లి కారాగారంలో ఉన్నారు. గత నెల 27న తుది విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది.