* పలు రైళ్లు నిలిపివేత
* ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణపై నిరసన
బీహార్ : ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణపై నిరసన ఉత్తరాదిలో ఈరోజు భారత్ బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణను నిరసిస్తూ పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ కొనసాగుతోంది. యూపీ, మధ్యప్రదేశ్ లలో దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీహార్ లో నిరసనకారులు పలు రైళ్లను నిలిపివేశారు. దర్భంగా, ముంగర్, అర్రాలలో ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. ఆయా రాష్ట్రాలలో ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, పెట్రోల్ బంక్స్ మూసివేశారు. పలు ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. కాగా, మధ్యప్రదేశ్ లో భారత్ బంద్ ప్రభావం అధికంగా ఉందని, 35 జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించినట్టు పోలీసులు అన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.