భారత్‌ బౌలర్ల హవా

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 11:22 AM

భారత్‌ బౌలర్ల హవా

ఇంగ్లండ్ గడ్డమీద టెస్ట్ సిరీస్ కోల్పోయి, ఓదార్పు విజయం కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకు బౌలర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రెండు సెషన్లు.. ఒక్క వికెట్.. 123 పరుగులు.. ఐదో టెస్టులో ఇంగ్లండ్‌కు లభించిన ఆరంభం ఇది. కానీ.. ఆట ముగిసేసరికి ఆతిథ్య జట్టు స్కోరు 198/7. ఆరంభంలో, మధ్యలో భారత బౌలర్లు విఫలమైనా.. మూడో సెషన్‌లో మాత్రం దుమ్మురేపారు. ఓపెనర్లు కుక్‌, జెన్సింగ్స్‌ జోడీ నిలకడగా ఆడుతూ శుభారంభాన్ని ఇచ్చినా వీరిద్దరూ నిష్క్రమించాక ఇంగ్లండ్‌ కోలుకోలేకపోయింది. అలిస్టర్‌ కుక్‌, మొయిన్‌ ఆలీలు అర్ధశతకాలతో రాణించినా 198 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది.

భారత్‌ బౌలర్ల జోరు చూస్తే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌కు తొలిరోజే ముగింపు పలుకుతారనిపించింది. చివర్లో బట్లర్‌ (11 నాటౌట్‌), ఆదిల్‌ రషీద్‌ (4 నాటౌట్‌)లు అడ్డుగోడగా నిలవడంతో సాధ్యం కాలేదు. భారత్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.మరి రెండో రోజు బ్యాటింగ్‌లోనూ ఇదే తడాఖా చూపెడుతారా? లేదా? అన్నది ఆసక్తికరం...!





Untitled Document
Advertisements