ఊహించినట్లుగానే టిఆర్ఎస్ నుంచి కొండా సురేఖ దంపతులకు ఎటువంటి జవాబు రాకపోవడంతో మంగళవారం ఉదయం వారు తమ నివాసంలో తమ అనుచరులతో సమావేశమయ్యి ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించారు. టిఆర్ఎస్ టికెట్ లభించే అవకాశం లేదు కనుక వేరే పార్టీలో చేరి ఆ పార్టీని టికెట్స్ కోసం యాచించడం కంటే స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి తమ సత్తా నిరూపించి చూపడమే మంచిదని నిర్ణయించారు. కొండా సురేఖ పరకాల నుంచి ఆమె కుమార్తె వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా తమ శక్తిసమార్ధ్యాలను టిఆర్ఎస్కు, తమ రాజకీయ ప్రత్యర్ధులకు చాటి చూపేందుకు ఈ నెల 23వ తేదీన ఆత్మకూరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సభలో ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించారు. ఈరోజు సాయంత్రంలోగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.