టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. టిఆర్ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్ చెన్నూరులో ఈనెల 12న ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి వచ్చినప్పుడు, ఆయనను వ్యతిరేకిస్తూ ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. వెంటనే అతనిని హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. కానీ 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న అతనిని కాపాడేందుకు యశోదా వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
చెన్నూరు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కాకుండా ఎంపీ బాల్క సుమన్కు ఇవ్వడంతో ఓదేలు నాలుగు రోజులు స్వీయ గృహనిర్బందం విధించుకొని టిఆర్ఎస్ అధినేతపై తిరుగుబాటుకు సిద్దం అయ్యారు. సరిగ్గా అదే సమయంలో బాల్క సుమన్ అక్కడికి ఎన్నికల ప్రచారానికి రావడంతో ఓదేలు వర్గం తీవ్ర ఆవేశానికి లోనయింది. ఆ సందర్భంగా ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య బాల్క సుమన్ను అడ్డుకొనేందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ తరువాత జరిగిన కధ అందరికీ తెలుసు. సిఎం కెసిఆర్ నల్లా ఓదేలుతో మాట్లాడిన తరువాత ఆయన చల్లబడిపోయి బాల్క సుమన్కు మద్దతు ప్రకటించారు. కానీ ఈ రాజకీయ చదరంగంలో ఒక నిండు ప్రాణం పోయింది.