‘ఆఫీసర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాక సోషల్ మీడియాకు దూరమైన వర్మ మళ్లీ జూలు విదిలించాడు. మిర్యాలగూడ కులహత్యపై ఘాటుగా స్పందించాడు. అసలు పరువు హత్య అంటే ఏమిటో కూడా నిర్వచం ఇచ్చాడు. ప్రణయ్ని చంపించిన మారుతిరావు పిరికిపంద, హంతకుడు అని తిట్టిపోశాడు.
‘పరువు కోసం ప్రణయ్ని చంపానని చెప్పుకుంటున్న మారుతీరావు ఏం సాధించాడని ప్రశ్నించాడు. ‘పరువు కాపాడుకోవడానికే ప్రణయ్ ప్రాణాలు తీయించానని చెప్పిన హంతకుడు తన పరువును తానే రోడ్డుకీడ్చుకున్నాడు. పరువు పోయింది గనుక మారుతీరావు చచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. నిజమైన పరువు హత్య అంటే.. పరువు కోసం హత్యచేసేవారిని చంపేయడమే’ అని ట్వీట్ చేశారు. కాగా, ప్రణయ్ హత్యపై సినిమా తీయాలని అభిమానులు వర్మను కోరుతున్నారు. కొందరు వర్మ టీటును తిట్టిపోతున్నారు. వర్మ ఇలాంటి వాటిపైనే స్పందిస్తాడని, దేశ భద్రత, రాజకీయ నేతల అవినీతిపై స్పందించడని అంటున్నారు. మారుతిరావు తన కూతురు అమృత.. ప్రణయ్ని కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకే సుపారీ ఇచ్చి చంపించిన సంగతి తెలిసిందే.