ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధిస్తుంది: అసదుద్దీన్

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 10:29 AM

ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధిస్తుంది: అసదుద్దీన్

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసి మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి కూడా ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధిస్తుంది. మళ్ళీ కెసిఆర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే, ఈ నాలుగేళ్లలో దేశంలో తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నెంబర్: 1 స్థానంలో నిలిపారు. అలాగే అనేక సంక్షేమపధకాలు అమలుచేస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల మనసులను గెల్చుకొన్నారు. రాష్ట్రంలో సుమారు 50,000 మంది ముస్లిం బాలబాలికలు గురుకుల పాఠశాలలో చదువుకొంటున్నారు. షాదీ ముబారాక్ పేరిట ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందుకొంటున్నారు. ఇవన్నీ టిఆర్ఎస్‌ గెలుపుకు ఎంతో దోహదపడతాయని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

మజ్లీస్ నేత ముఖ్యమంత్రి కావడం గురించి ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై విలేఖరి ప్రశ్నకు సమాధానంగా “మీ మీడియావాళ్ళు టి.ఆర్.పి. రేటింగ్ పెంచుకోవడానికి మేము చెప్పే మాటలలో ‘మసాలా’ ఉన్నవి మాత్రమే తీసుకొని మిగిలింది పక్కన పడేస్తారు. అక్బరుదీన్ విషయంలో మీరు చేసింది అదే. అయితే మాకు అటువంటి ఆలోచన లేదు. టిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేము టిఆర్ఎస్‌ ప్రభుత్వంలో చేరబోము. మాకు రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే కావాలి. అవి జరుగుతున్నప్పుడు మేము ప్రభుత్వంలో తలదూర్చవలసిన అవసరమే లేదు,” అని చెప్పారు.





Untitled Document
Advertisements