తెలుగు సినిమాలలో ఎక్కువగా విలన్ పాత్రలలో కనిపించే జివి సుధాకర్ నాయుడు త్వరలో జరుగబోయే ఎన్నికలలో కూకట్పల్లి నుంచి పోటీ చేయబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఆయన నిన్న ధర్మారెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ప్రత్యేక పూజలు జరిపించిన తరువాత తాను కూకట్పల్లి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రెండు తెలుగు రాష్ట్రాలలో పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పదవులు, అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. పైగా ప్రజలను కుల,మత, ప్రాంతాలవారీగా విభజించి పాలిస్తున్నారు. పాలకులకు బుద్ది చెప్పవలసిన తరుణం ఆసన్నమైంది. అందుకే నేను త్వరలో జరుగబోయే ఎన్నికలలో కూకట్పల్లి నుంచి పోటీ చేయాలనుకొంటున్నాను. త్వరలోనే దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తాను,” అని చెప్పారు.
సుధాకర్ నాయుడు గత ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ పై విశాఖపట్నంలో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత మళ్ళీ సినిమాలలో బిజీ అయిపోయారు. ఈసారి కూకట్పల్లి నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటించుకొన్నారు కనుక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు భావించవచ్చు.