దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం దిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు మరో ఇద్దరు సభ్యులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఉమేష్ సిన్హా కమిటీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్కు నివేదిక అందజేసింది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగానే ఉన్నాయని, ముందస్తు ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉందని నివేదికలో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించామని, ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని కమిషన్ అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరాంతో పాటే ఎన్నికలు నిర్వహించవచ్చని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వారం పది రోజుల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఈసీ పర్యటన అనంతరం ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని రావత్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఓపీ రావత్ ఇటీవల రాజస్థాన్ పర్యటన పూర్తి చేశారు. మొత్తం మీద నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.