ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెచ్చేది చంద్రన్నేనని పంచాయతీరాజ్, ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2019 ఎన్నికల్లో 25 పార్లమెంట్ సీట్లు గెలిచి ఢిల్లీ లో చక్రం తిప్పేదీ చంద్రబాబుగారేనని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ర్ట విభజనచట్టంలో పేర్కొన్న 18 అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చినవారినే ప్రధానమంత్రిని చేస్తామని మంత్రి చెప్పారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ధర్మపోరాట సభలో మంత్రి నారా లోకేష్..ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని పదునైన ప్రసంగంతో నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జీరో అని తెలిసినా, కేవలం ప్రత్యేక హోదా ఇస్తుందని, విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తుందని పొత్తు పెట్టుకున్నామన్నారు.