టిఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ తాను ఈసారి పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. అయితే ఆమె కుమార్తె పోటీ చేస్తున్నారా లేదా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలుచుకోవడం తధ్యమని ఆమె చెప్పారు. వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించుకొనే బాధ్యత తమదేనని కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాట్లపై ఇంకా చర్చలు మొదలవలేదని, అవి ఒక కొలిక్కి వచ్చేక కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఎటువంటి పదవులు, టికెట్లు ఆశించి చేరడం లేదని బేషరతుగా చేరుతున్నానని మూడు రోజుల క్రితమే చెప్పిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించక మునుపే తాను పరకాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించుకోవడం విశేషం.