బుధవారం నుంచి సిఎం కెసిఆర్ మళ్ళీ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయవాతావరణం వేడెక్కిపోయుంది. సిఎం కెసిఆర్ ప్రచారంతో అది ఇంకా వేడెక్కవచ్చు.
సిఎం కెసిఆర్ బుధవారం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ చేరుకొంటారు. ఆయన మొదట జిల్లా నుంచి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్ధులను ఓటర్లకు పరిచయం చేసిన తరువాత, గత నాలుగేళ్ళలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి మళ్ళీ తమ పార్టీని గెలిపించవలసిందిగా ప్రజలను కోరనున్నారు. గత నాలుగేళ్ళలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల గురించి ఆయన ఏమి చెపుతారో అందరికీ తెలుసు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ను డ్డీ కొనడానికి కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న మహాకూటమి గురించి సిఎం కెసిఆర్ ఏమి చెపుతారనేదే ఆసక్తికరం. ఇటీవల రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్ తదితరులపై జరిగిన ఐటిన దాడులు సిఎం కెసిఆర్ చేయించినవేనాని రేవంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపద్యంలో సిఎం కెసిఆర్ వారి ఆరోపణలను ఏవిధంగా తిప్పి కొడతారో చూడాలి.
నిజామాబాద్ జిల్లాలో గణేష్ బీగాల (అర్బన్), బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి (రూరల్), వేముల ప్రశాంత రెడ్డి (బాల్కొండ) షకీల్ అహ్మద్ (బోధన్), ఆశన్నగారి జీవన్ రెడ్డి (ఆర్మూర్), వేముల ప్రశాంత రెడ్డి (బాల్కొండ) టిఆర్ఎస్ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారసభ టిఆర్ఎస్ అభ్యర్ధులందరికీ చాలా కీలకం కనుక వారు కూడా భారీగా జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.