నెల్లూరు ,అక్టోబర్ 03: రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరులో టీడీపీని బలోపేతం చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయాస పడుతున్నారు. ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉండడంతో ఆయన ఇక్కడ ఆ పార్టీకి చెక్ పెట్టి.. టీడీపీ జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని కీలక నాయకులకు ఇప్పటికే బాధ్యత లు కూడా అప్పగించారు. డబ్బులు కావాలా ఎంతైనా తీసుకోండి.. ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి.. ముఖ్యమైంది అయితేనే నాకు చెప్పండి.. వైసీపీకి మాత్రం ఇక్కడ చుక్కలు కనిపించాలి- అని చంద్రబాబు ఇప్పటికే తన పార్టీ నాయకులకు చెప్పేశారు. దీంతో నాయకులు విజృంభించేందుకురెడీ అయ్యారు.
అయితే, అదేసమయంలో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంపై కన్నేసిన చంద్రబాబు ఇక్కడ నుంచి ఎవరిని దింపితే బాగుంటుందనే విషయంపై ఆలోచించారు. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో ఉన్నసమయంలో ఆయనకు ఈ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచన కూడా చేశారు. అయితే, ఆయన పార్టీ మారిపోవడంతో ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి మేయర్ అజీజ్ను బరిలోకి దించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి అజీజ్ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. మంత్రి నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో సిటీ అభ్యర్థిగా అజీజ్కే ఎక్కువ అవకాశాలు ఉండేవి. అయితే నారాయణనే బరిలోకి దించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్న క్రమంలో అజీజ్కు ఆ అవకాశం చేజారిపోయింది.