మనుషుల్ని మించిన ఎలుకలు!!

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 06:16 PM

మనుషుల్ని మించిన ఎలుకలు!!

బీహార్ ,అక్టోబర్ 03: మందును మనుషులే తాగుతారనుకుంటున్నారా? లేదండి జంతువులు కూడా తాగుతాయట. అని నిరూపించాయి బీహార్ కు చెందిన ఎలుకలు. బీహార్ లోని కైమూర్ జిల్లాలోనే ఈ వింత ఘటన చోటు చేసుకున్నది. బీహార్ రాష్ట్రంలో మద్యం నిషేధం కదా. అయినా.. కొందరు ఎలాగోలా ఎక్కడి నుంచో మద్యాన్ని పట్టుకొచ్చి అమ్ముతుంటారు. అదంతా ఓపెన్ సీక్రెట్. అప్పుడప్పుడు పోలీసులు రైడ్ చేస్తుంటారు.. ఆ మద్యాన్ని సీజ్ చేస్తుంటారు. అయితే.. సీజ్ చేసిన మద్యాన్ని పోలీసులు అధికారుల సమక్షంలో ధ్వంసం చేయాలి.

సీజ్ చేసిన మద్యాన్ని ఓ గదిలో దాస్తారు. మద్యం బాటిళ్లు చాలా పోగయ్యాక ఒకేసారి అధికారుల ముందు వాటిని నాశనం చేస్తారు. అలా మద్యాన్ని నాశనం చేయడం కోసం పోలీసులతో కలిసి అధికారులు గదిలోకి వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే.. బీర్ క్యాన్లలో బీర్ లేదు. క్యాన్లన్నిటికీ పెద్ద పెద్ద రంధ్రాలున్నాయి. ఏమైంది అని అధికారులు ఆశ్చర్యంగా అడిగితే… ఎలుకలు తాగి ఉండొచ్చని అధికారులకు జవాబిచ్చారు పోలీసులు. దీంతో నోరెళ్లబెట్టడం అధికారుల వంతయింది.

గత సంవత్సరం కూడా ఈ తరహా ఘటనే ఇదే బీహార్ లో చోటు చేసుకున్నది. అప్పుడు కూడా మద్యాన్ని ఎలుకలు తాగేశాయని అధికారులకు తెలిపారు పోలీసులు. అంతే కాదు.. డ్రగ్స్ ప్యాకెట్లనూ ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టుకు విన్నవించారు. అయ్ బాబోయ్.. బీహార్ ఎలుకలు చాలా స్ట్రాంగ్ అన్నమాట. వాటికి ఇదేం అలవాటో.. డ్రగ్స్, మందు అలవాటు. అబ్బే.. బీహార్ ఎలుకలు బాగా చెడిపోయాయ్.. ఏమంటారు?





Untitled Document
Advertisements