కేరళ, నవంబర్ 5: శబరిమల ఆలయ వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును స్వాగతించి పోలీసుల సహాయంతో అమలుచేయడానికి పూనుకొంది. దీంతో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తున్న వర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా ఆనవాయితీ ప్రకారం సోమవారం సాయంత్రం శ్రీచిత్తర తిరువాల్ ఉత్సవ నిర్వహణ కోసం శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం మళ్ళీ ఆలయాన్ని మూసివేస్తారు. కనుక మళ్ళీ ఇవాళ్ళ కూడా అనేకమంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతుండటంతో వారిని అడ్డుకొనేందుకు మరో వర్గం సిద్దంగా ఉంది.
శబరిమల ఆలయానికి వెళ్ళే మార్గంలో గల పంబ, నీలక్కల్, ఎలవుంకల్ మరియు ఆలయ సన్నిధానంలో 72 గంటలపాటు సెక్షన్ 144 (కర్ఫ్యూ) విధించినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్త కోసం 100 మంది మహిళా పోలీసులతో సహా మొత్తం 2,300 మంది పోలీసులను, 20మందితో కూడిన కమెండో బృందాలను మోహరించింది. కానీ ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు శబరిమల ఆలయానికి తరలివస్తుండటంతో వారిని నియంత్రించడం పోలీసులకు చాలా కష్టంగా ఉంది.