హైదరాబాద్, నవంబర్ 09: నగరంలో రోజురోజుకి పెరుగుతున్న రద్దీని తట్టుకొనేందుకు ప్రభుత్వం అనేకచోట్ల ఫ్లై-ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బయోడైవర్సిటీ జంక్షన్ లో రూ.108.59 కోట్లు వ్యయంతో మైండ్ స్పేస్ వద్ద నిర్మించిన ఫ్లై-ఓవర్ శుక్రవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మంత్రులెవరూ ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనకూడదూ కనుక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ దీనిని ఈరోజు ఉదయం ప్రారంభించారు. దీంతో బయోడైవర్సిటీ కూడలిలో ట్రాఫిక్ కష్టాలు కొంతవరకు ఇక తీరిపోతాయి.