డైలాగ్ కింగ్ మోహన్ బాబు తెలంగాణపై డైలాగ్ విసిరారు. ఈసారి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే గెలవాలి, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఫిల్మ్నగర్ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడైన మోహన్బాబు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఆలయ సిబ్బంది, అర్చకుల తరఫున స్వరూపానందేంద్ర స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బందికి ఆయన వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మోహన్బాబు తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరించారు. మళ్లీ మీరే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా అంటూ తుమ్మలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యకమంలో ఆలయ కమిటీ సభ్యులు పరుచూరి గోపాలకృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.